ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం లోని వైకుంఠధామంలో 300 చెట్లను కట్ చేసి, ఆ ప్రాంతాన్ని చదును చేయడం చర్చనీయాంశమైంది. మూడేండ్ల కిందట అప్పటి ప్రభుత్వం ఒక్కో మొక్కకు రూ.60లు పెట్టి, 11 వందలకు పైగా మొక్కలు నాటాగా.. పంచాయతీ సిబ్బంది వాటిని సంరక్షించారు. అయితే గురువారం కొందరు శ్మశాన వాటికలోకి వెళ్లి మూడు వందలకు పైగా కానుగ, వేప, పూల చెట్లను తొలగించారు.
అనుమతులు లేకుండా జేసీబీ సహాయం తో చెట్లను వేర్లతో సహా నేలమట్టం చేశారు. విషయమై జీపీ సెక్రటరీని వివరణ కోరగా తనకేమీ తెలియదని, వైర్ల కింద చెట్లు ఉన్నాయని, విద్యుత్ అధికారుల కట్ చేసిఉండొచ్చని తెలిపారు. ఇటు విద్యుత్ అధికారులను సంప్రదిస్తే.. సిబ్బంది సమ్మెలో ఉన్నారని, తమకేమీ తెలియదని చెప్పుకొచ్చారు.

